పోట్టేళ్ల పోట్లాట... మధ్యలోకి వెళ్లిన కాపరి బలి!

  • ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో ఘోరం
  • రెండు పొట్టేళ్లు కొట్లాడుకుంటుండగా ఆపడానికి వెళ్లిన కుటుంబరావు
  • పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో ఘోరం జరిగింది. రెండు పొట్టేళ్ళ మధ్య జరిగిన పొట్లాటను ఆపబోయిన గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉప్పలచెలక గ్రామానికి చెందిన కుటుంబరావు అదే గ్రామానికి చెందిన వీర్రాజు అనే రైతు వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన కుటుంబరావు గొర్రెలను మేపడానికి గ్రామంలోని కొత్తచెరువు ప్రాంతానికి తీసుకువెళ్లాడు.

అక్కడ రెండు పొట్టేళ్ళు తీవ్రంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. దీంతో వాటిని ఆపడానికి కుటుంబరావు వెళ్ళాడు. అప్పటికే ఆవేశంగా కొట్టుకుంటున్న రెండు పొట్టేళ్ళు మధ్యలోకి వచ్చిన కుటుంబరావుపై దాడి చేశాయి. పొట్టేళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడిన కుటుంబరావు స్పృహతప్పి పడిపోయాడు. సమీపంలోనే పశువులను కాస్తున్న ఓ మహిళ గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు 108కి సమాచారం ఇచ్చారు.

అతనిని సమీపంలోని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కుటుంబరావు ఈరోజు మృతి చెందాడు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Kutumba Rao
Khammam district
Penuballi
Uppalachalka village
Sheep fight
Goatherd death

More Telugu News